
తాజ్ మహల్ పై ఎప్పటినుంచో ఓ వివాదం నడుస్తోంది. అది ముంతాజ్ సమాధికాదని…తేజోమహల్ అనే ఆలయం అని మొఘలులు ధ్వంసం చేసిన వేలాదిమందిరాల్లో అదీ ఒకటని.. అయితే దానికి సంబంధించిన మరో వివాదం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.. కోర్టు తీర్పుతో సద్దుమణిగింది కూడా. తాజ్ మహల్ ను ఆనుకుని ఉన్న మహతాబ్ భాగ్ పక్కనున్న స్థలం తనదని సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఓరైతు ఎట్టకేలకు దాన్ని సొంతం చేసుకున్నాడు. న్యాయస్థానం తీర్పు తనకు అనుకూలంగా రావడం ఆలస్యం.. ఆ భూమిని ట్రాక్టర్ తో దున్నేసుకున్నాడు. బారికేడ్స్ ఏర్పాటు చేసేసుకున్నాడు. నో ఎంట్రీ బోర్టూ పెట్టేసుకున్నాడు.
ఆ రైతు పేరు మున్నాలాల్. కచ్ పురా జీల్లా దేవ్ జిత్ వాసి. ఆ పార్క్ లోని 6 బిగాల జాగా తమదని…కొన్ని తరాలనుంచి తమ పూర్వీకుల స్వాధీనంలోనే ఉందని వాదిస్తూ వస్తున్నాడు. 1976లో అర్బన్ సీలింగ్ సమయంలో అధికారులు దాన్ని లాగేసుకున్నారని పత్రాలూ చూపించాడు. వారసత్వంగా వచ్చిన తన భూమి తనకు ఇప్పించాలంటూ 40ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు. 2020లో అగ్రా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లో ఆ భూమిపై తన యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేశాడు. 1998 నుంచి 2020 వరకు ఉన్న అన్నిరకాల రెవెన్యూ డాక్యుమెంట్లనూ ఎవిడెన్సు గా నివేదించాడు. అన్నింటిని పరిశీలించిన కోర్టు వాటి ఆధారంగా ఆ భూమి మున్నాలాల్ దేనని నిర్థారించింది. తీర్పు అనుకూలంగా రావడంతో వెనువెంటనే తన స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు, ఎవరికీ ప్రవేశం లేదంటూ బోర్డూ పెట్టేశాడు.
అయితే మున్నాలాల్ కు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు తాజ్ మహల్ ప్రేమికులకు, లక్షలాదిగా అక్కడికి వచ్చే పర్యాటకులకు కాస్తఆశాభంగం కలిగించే విషయం. ఎందుకంటే ఆ పాలరాతిఅద్భుతాన్ని చూడడానికి వచ్చే ప్రతిఒక్కరూ మహతాబ్ భాగ్ పక్కనే ఉన్న పదకొండు మెట్ల పార్క్ నుంచి సూర్యాస్తమ దృశ్యాన్ని, పున్నమి నాటి వెన్నెలను తిలకిస్తుంటారు. అంతేకాదు ప్రత్యేక సందర్భాల్లో అక్కడ అనేక సాంస్కృతిక ఉత్సవాలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడెవరూ ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించలేరు. కారణం… ఇప్పుడు అటువైపు ఎవరూ వెళ్లడానికి లేదు. వారసత్వంగా తాను గెలుచుకున్న స్థలంలోకి ఎవరికీ ఎంట్రీ లేదంటూ మున్నాలాల్ బోర్డు తగిలించేశాడు. అయితే ఈ భూమి ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీ ఏడీఏ పరిధిలోకే వస్తుందని… తాజా పరిణామాలపై విచారణ జరుపుతామని అధికారులంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.















