
కేంద్ర మంత్రి మండలి జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశముంది. డిసెంబర్ 20 న సమావేశాలు ముగిసేలోపు ప్రవేశపెట్టి పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది. ముందుగా పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి.. తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు నిర్వహించాలన్నది కమిటీ ప్రతిపాదన. లోక్ సభకి, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించటానికి రాజ్యాంగ సవరణ అవసరం. కానీ వీటిని రాష్ట్రాలు ఆమోదించాల్సిన పన్లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విధానాన్ని మార్చటానికి మాత్రం సగం కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాలి.
రాజ్యాంగంలోని 83వ ఆర్టికల్ లోక్ సభ వ్యవధి, ఆర్టికల్ 172 శాసనసభ వ్యవధి గురించి చర్చిస్తుంది. ఒక వేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. చాలా రాష్ట్రాల శాసనసభలకు మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రియాల్టీలోకి 2029లో వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ ఐదు సంవత్సరాల పూర్తి కాలం గడవక ముందే మెజార్టీ కోల్పోయి లోక్ సభ లేదా శాసన సభ రద్దయితే.. కేవలం మిగిలిన కాలానికి మాత్రమే తర్వాతి ప్రభుత్వం ఏర్పడాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే…2029లో జమిలి ఎన్నికలు జరపాలని చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు పూర్తి చేయకుండానే రద్దు చేయాల్సి వస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ ఎన్నికలు నిర్వహించుకున్న హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు 2027 నాటికి ఎన్నికలు నిర్వహించాలి. అలాగే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయా శాసన సభల్ని రద్దు చేసి లోక్ సభతో పాటు ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ ప్రభుత్వాలు 2026లోనే ఎన్నికలకు వెళ్తాయి. కాబట్టి ఆయా ప్రభుత్వాలు మూడేళ్ల పాటు అధికారంలో ఉంటాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు లోక్ సభ ఎన్నికలు అటు ఇటుగా జరిగాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికలకయ్యే ఖర్చు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల్ని నిర్వహించేందుకు, ఈవీఎంలు తయారు చేసేందుకు 8 వేల కోట్లు ఖర్చు అవుతోందని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ ఖర్చులో స్థానిక సంస్థలకు అయ్యే వ్యయాన్ని కలపలేదు. ఇంకా ట్రాన్స్ పోర్టేషన్, గిడ్డంగులు, ఇంకా ఇతర ఖర్చుల్ని కూడా కలపకుండానే భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.

ప్రతి ఆరు నెలలకొకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు, ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి సాగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కోసం పని చేయటం వల్ల అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇంకా ఓటర్లు కూడా తరచు ఎన్నికల్లో పాల్గొనేందుకు దూరభారం లాంటి కారణాలతో ఆసక్తి చూపట్లేదు. ఇక ఎన్నికల కోడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు, అభివృద్ధి పనుల్ని ప్రకటించలేకపోతున్నాయి. ఇక కోవింద్ కమిటీకి 47 పార్టీలు తమ అభిప్రాయాల్ని సమర్పించాయి. అందులో 32 పార్టీలు అంగీకరించాయి. 15 పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విభజించు పాలించు నినాదాన్ని పట్టుకొని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే… జాతీయ ప్రయోజనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతారని భయపడుతున్నట్టుంది.















